రైతు - పేద 1

సాగు భారమై.. బతుకు ఆగమై.. 
నిట్ట నిలువునా కూలుతున్న రైతన్న
చేల గట్లపై మరణ మృదంగం పెరుగుతున్న ఆత్మహత్యలు
16 ఏళ్లలో 31 వేల మంది బలవన్మరణం పెరిగిన పెట్టుబడులు, గిట్టుబాటుకాని ధరలే ప్రధాన కారణం అందని ప్రభుత్వ ప్రోత్సాహం,
రుణం కౌలు రైతుల బతుకు మరీ కష్టం అధికారిక నివేదికల్లోనే వెల్లడి....



ఒక రైతుకు వరి శిక్ష! మరో రైతు నెత్తిన పత్తి కత్తి! ఇంకో రైతుకు నిలువెల్లా కూర గాయాలు! మరో రైతుకు భారంలా వేరుశనగ! ఘోరంగా ఉల్లి! చేదుగా చెరుకు! ఏ రైతును చూసినా... కష్టమే! సాగు నష్టమే! పొలాలనన్నీ హలాల దున్నే రైతులు తమ బలాన్ని మాత్రమే కాదు... ప్రాణాలనూ పొలానికే అర్పిస్తున్నారు...

ఇది ఒక్క ఏడాది కథ కాదు! ఎన్నో ఏళ్లుగా సాగుతున్న వ్యథ! ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు రైతులకు భరోసా ఇవ్వడంలేదు. ఎరువు బరువై... కూలీలు కరువై. నీరు కన్నీరై... విత్తు దశ నుంచే చిత్తు చిత్తై అన్నదాతలు నిట్టూర్పు వదులుతున్నారు. పెరుగుతున్న పెట్టుబడులు, కనికరించని ప్రకృతి... రైతులను జంట కోరల పాములా కాటేస్తున్నాయి. కడివెడు దాహానికి చుక్క నీరు పోసినట్లుగా... బ్యాంకులు, ప్రభుత్వ సంస్థలు అందించే రుణాలు రైతు అవసరాలను తీర్చలేకపోతున్నాయి.

ప్రైవేటు వ్యాపారుల వడ్డీలు నడ్డి విరుస్తుంటే, కాళ్ల కింద భూమి కదిలిపోతుంటే... బతుకే భారమనుకుని రైతు తనువు చాలిస్తున్నాడు. 1995 నుంచి 2010 మధ్య... అంటే 16 సంవత్సరాల్లో మన రాష్ట్రంలో ఏకంగా 31,120 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇది జాతీయ నేర సమాచార విభాగం చెప్పిన అధికారిక సమాచారం! దీనికి కారణాలను సుస్థిర వ్యవసాయ కేంద్రం, రైతు సురాజ్య వేదిక, యాక్షన్ ఎయిడ్, జయతీ ఘోష్ కమిటీ తదితర సంస్థలు, సంఘాలు విశ్లేషించాయి.

'కౌలు రైతులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరలేదు. వ్యవసాయ అనుబంధ పరిశ్రమలను పట్టించుకోవడంలేదు. ఆత్మహత్యలపై ఆందోళన వ్యక్తం చేయడంతప్ప... వాటి నివారణపై చిత్తశుద్ధి కనిపించడమే లేదు'' అని తెలిపాయి. రైతుకు అండగా నిలిచే వ్యవసాయ రంగానికి సంబంధించిన ముఖ్య సంస్థలను ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని పేర్కొన్నాయి. వీటన్నింటి ఫలితమే... రైతుల ఆత్మహత్యలు అని వివరించాయి.
రాలుతున్న రైతులు రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే అగ్రస్థానం మన పొరుగునే ఉన్న మహారాష్ట్రది. ఆ తర్వాతి స్థానం... ఆంధ్రప్రదేశ్‌దే. గత ఏడేళ్లుగా... కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఉత్తరప్రదేశ్‌లలో రైతు ఆత్మహత్యల సంఖ్య తగ్గుతుండగా... మన రాష్ట్రంలో పెరిగిపోతున్నాయి. 'మాది రైతు సంక్షేమ ప్రభుత్వం' అని చెప్పుకొన్న కాలంలోనూ పెద్ద సంఖ్యలో రైతుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. 1995-2002 మధ్య ఎనిమిదేళ్ల కాలంలో 12,716 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.


2003-2010 మధ్యకాలంలో బలవన్మరణం పాలైన అన్నదాతల సంఖ్య ఏకంగా 18,404కు చేరింది. ఒకవైపు రైతుల వారసులు వ్యవసాయాన్ని వదిలి ఇతర వ్యాపకాలు చూసుకుంటుండగా... మరోవైపు హలం బాట పట్టిన యువ రైతులు మధ్యలోనే జీవితమనే కాడిని పారేస్తున్నారు. యువ రైతులు వాణిజ్య పంటలకు ప్రాధాన్యమిస్తూ... అతివృష్టి, అనావృష్టి కారణంగా పంటలు దెబ్బతి, పెట్టుబడులూరాక చివరికి ఆత్మహత్యకు పాల్పడుతున్నారు.
2010లో 15-29 ఏళ్ల మధ్య వయసున్న 728 మంది యువ రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో... యువకులు 563 మందికాగా, మహిళలు 165 మంది. ఇక అదే సంవత్సరం 30-44 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన వారిలో 824 మంది పురుషులు, 137 మంది మహిళలు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈ ఒక్క సంవత్సరంలోనే మొత్తం 2525 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు ఎన్‌సీఆర్‌బీ అధికారికంగా తెలిపింది.

ఇవీ కారణాలు:
 * వ్యవసాయ పెట్టుబడులు పెరిగాయి.
*బోర్లపై ఆధారపడటం అధికమైంది. బోర్లు విఫలం కావడంతో రైతులపై భారం పెరిగిపోతోంది.
 * ధరలు గిట్టుబాటు కావడంలేదు. కనీస పెట్టుబడులు కూడా తిరిగి రావడంలేదు.
 * రైతులు సుస్థిరమైన వ్యవసాయ విధానాలు అనుసరించడంలేదు.
 * చిన్న కమతాలు, కౌలు సేద్యంతో కలిసిరావడంలేదు.
* వ్యాపార స్వేచ్ఛ, ఎగుమతి-దిగుమతి విధానాలు రైతులకు అనుకూలంగా లేవు.
 * బీమా, మార్కెటింగ్, నిల్వ సదుపాయాలు తగిన స్థాయిలో లేవు. 
* వర్షాధార వ్యవసాయాన్ని ప్రభుత్వం విస్మరించింది.
 * ప్రభుత్వ విధానాలు పెద్ద రైతులకు, భారీ తరహా వ్యవసాయానికి, కొన్ని రకాల వ్యాపార పంటలకు మాత్రమే ఉపయోగపడుతున్నాయి.

దిగదుడుపు 
మార్కెట్‌లో వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. కానీ... రైతుకు మాత్రం గిట్టుబాటు ధర లభించదు. 2010-11, 2011-12లో ధరలను పరిశీలిస్తే... అప్పుడు క్వింటాలు పత్తి ధర రూ.6500. అదే పత్తి ఇప్పుడు రూ.3600. అప్పుడు క్వింటాలు పసుపు రూ.14 వేలు. ఇప్పుడు రూ.4 వేలు. అప్పటికీ, ఇప్పటికీ మిర్చి రూ. 12 వేల నుంచి రూ.5500కు తగ్గింది. కందులు రూ.5 వేల నుంచి రూ. 3500లకు, మినుములు 5200 నుంచి రూ.3500కు తగ్గాయి, జొన్న 2500 నుంచి రూ.1800కు తగ్గాయి. పెట్టుబడులు మాత్రం భారీగా పెరిగాయి.

జయతీ ఘోష్ సిఫార్సులివి...
 * అందరికీ సాగునీరందేలా చేయాలి. 
* కౌలుదారులతోసహా రైతులందరికీ బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించాలి.
 * మెట్ట భూముల అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవాలి.
* సుస్థిరమైన, చౌకగా లభించే ఉత్పాదకాలను ఉపయోగించాలి. 
* గిట్టుబాటు ధర విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించాలి.
 * గ్రామీణులు ఆర్థికంగాఎదిగేలా వ్యవసాయేతరకార్యకలాపాలను ప్రోత్సహించాలి.

ఆత్మహత్యలు నివారించాలంటే...
 * పంట నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం అందించాలి. 
* రైతులనుంచి ప్రభుత్వమే పంటను గిట్టుబాటు ధరలకు కొనుగోలు చేయాలి.
 * ఎగుమతి, దిగుమతి విధానాలను మన రైతులకు అనుగుణంగా మార్చాలి.
 * ప్రభుత్వం సకాలంలో ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా, రుణ చెల్లింపునకు సహకరించాలి. * మార్కెట్‌లో గిట్టుబాటు ధర లేనప్పుడు పెట్టుబడి వ్యయంతో పాటు అదనంగా 50 శాతం ధర చెల్లించాలి.

SOURCE: ANDHRAJYOTHI
Share:

0 comments:

Post a Comment

Follow us @ www.facebook.com/YuvaNirmaan